Reading Time: < 1 minute

భారత్ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. భారత్ ఆత్మనిర్భర్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సర్వం AI ఇప్పుడు ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఏఐ మోడల్, విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా అభివృద్ధి కావడం విశేషంగా నిలుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఏఐ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుండటంతో సర్వం AIపై ఆసక్తి మరింత పెరిగింది.

సర్వం AI సాధించిన ఈ విజయాన్ని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహిరంగంగా ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ డిడి దాస్ చేసిన వ్యాఖ్యలను పంచుకుంటూ, భారత సార్వభౌమ ఏఐ వ్యూహం సరైన దిశలో ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. గతంలో గూగుల్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన డిడి దాస్, సర్వం AI సామర్థ్యాలు తన అంచనాలను మించిపోయాయని తెలిపారు. ప్రత్యేకంగా ఇండిక్ భాషలపై ఈ మోడల్ చూపిస్తున్న పనితీరు అద్భుతమని, టెక్స్ట్-టు-స్పీచ్, OCR ఫీచర్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.

ఇటీవల ప్రారంభించిన సర్వం విజన్ అనే మల్టీ-మోడల్‌తో ఈ ఏఐ మరింత దూకుడు చూపిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం సహా 22 అధికారిక భారతీయ భాషల్లో అధిక ఖచ్చితత్వంతో పనిచేస్తూ, ప్రాథమిక పరీక్షల్లో అంతర్జాతీయ మోడళ్లకంటే మెరుగైన OCR ఫలితాలు ఇచ్చినట్లు సమాచారం. తాటి ఆకుల గ్రంథాలు, పాత రికార్డులు, చారిత్రక శాసనాలను డిజిటలైజ్ చేయడంలో ఇది కీలకంగా మారనుంది. భవిష్యత్తులో మెటీరియల్ సైన్స్, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లోనూ భారతీయ ఏఐ మోడళ్లు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.