Reading Time: 2 minutes

ఇటీవలి రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ అకస్మాత్తు పతనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడం, పెట్టుబడిదారులు లాభాల కోసం అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల దేశీయ మార్కెట్‌లోనూ ధరలు దిగివచ్చాయి. దీనితో వినియోగదారులకు కొంత ఉపశమనం లభిస్తోంది.

గత వారం రోజుల్లో బంగారం ధరలు స్పష్టంగా తగ్గాయి. ఈ కాలంలో 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.3,980 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా సుమారు రూ.3,650 తగ్గింది. అలాగే వెండి ధరలు మరింత భారీగా పడిపోయాయి. గతంలో కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయలను దాటగా, ప్రస్తుతం అది సుమారు రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. అంటే వెండి ధర దాదాపు రూ.1.20 లక్షలకు పైగా తగ్గింది. అదే విధంగా తులం బంగారం ధర గతంలో రెండు లక్షల రూపాయల వద్ద ఉండగా, ప్రస్తుతం సుమారు రూ.1.56 లక్షల వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 4,800 డాలర్ల కంటే దిగివచ్చాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని అవలంబించడం వల్ల ఈ తగ్గుదల చోటుచేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ విలువలో మార్పులు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు కూడా లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

బంగారం, వెండితో పాటు రాగి ధరల్లోనూ అస్థిరత కనిపిస్తోంది. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో రాగి ధరలు కిలోకు రూ.1,242 వద్ద ముగిశాయి. అంతర్జాతీయంగా కూడా రాగి ధరలు తగ్గాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ధరల పతనం పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలను తెస్తోంది. వివాహాలు లేదా పెట్టుబడి అవసరాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది అనుకూల సమయమని, అయితే కొనుగోలు ముందు స్థానిక ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.