Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమైంది. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు నీట్ యూజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు కనీసం 17 ఏళ్లు పూర్తి అయి ఉండాలి. మార్చి 8, 2026 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈసారి ఆధార్ ఈ-కేవైసీ తప్పనిసరి చేయడంతో పాటు లైవ్ ఫొటో క్యాప్చర్‌ను కూడా దరఖాస్తులో భాగంగా అమలు చేస్తున్నారు. అభ్యర్థుల చిరునామా ఆధారంగానే పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు.

దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1700, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.1000గా నిర్ణయించారు. పరీక్ష మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు.