మెదక్ జిల్లా
ఏప్రిల్ 27, 2023
✍️భైరవ్ రెడ్డి

పచ్చదనంతో పాటు ఫలసాయంతో సంపద పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 9వ విడత హరిత హారంలో సంపద వనాల పేరిట నీటిపారుదల భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టనునున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి ఉపాధి హామీ పధకం, ఒడిఎఫ్ ప్లస్ స్వచ్ఛ సర్వేక్షన్ , హరిత హారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…

నీటిపారుదల ఉన్న చెరువులు, కాలువల వెంట బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించిందని, మన జిల్లాలో 2,600 చెరువులు 532. 4 కిలో మీటర్ల మేర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. ఎలాంటి వివాదాలు లేని 3 ఎకరాల నుండి 30 ఎకరాల పైగా ఎఫ్.టి.ఎల్. ఉన్న చెరువు ప్రాంతాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేయుటకు ఆ ప్రాంతం అనువుగా ఉన్నదా, అభివృద్ధి పరచాలా, భూసారా పరీక్షలు నిర్వహించి ఏ మొక్కలు పెంపకానికి అనువుగా ఉంటాయి, ఎన్ని వరుసలలో మొక్కలు నాటవచ్చు , వాటి నిర్వహణ మొక్కలకు నీరు అందించడానికి ఉన్న వనరులు ఏమిటి తదితర విషయాలను ఎంపిడిఓ, ఎంపిఓ , నీటిపారుదల, ఎపిఎం ల బృందం క్షేత్ర స్థాయిలో ప్రతి చెరువును పరిశీలించి, అధ్యాయనం చేసి డి.పి .ఆర్.(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించాలని సూచించారు. పెద్ద మొక్కలు నాటేలా ప్రతి గ్రామ పంచాయతీలో అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా మునిసిపాలిటీలలో అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ ను డి.ఫై.ఆర్. రూపొందించాలని మునిసిపల్ కమీషనర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నుండే క్షేత్రస్థాయిలో పర్యటించి 17 కాలమ్స్ ప్రొఫార్మాలో నివేదికలు అందజేయాలని, అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

పల్లె, పట్టణ ప్రగతిని సమీక్షిస్తూ ప్రతి వైకుంఠధామం వినియోగంలో ఉండేలా అవసరమైన వాటికి విద్యుత్, నీటి సరఫరాకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పధకం క్రింద ప్రతి గ్రామ పంచాయతిలో అధిక పనులు గుర్తించి రోజు 150 మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పిస్తూ కూలీ 272 రూపాయలకు తగ్గకుండా వచ్చేలా చూడాలన్నారు. మిగిలిపోయిన 12 గ్రామా పంచాయతీలలో కూడా వెంటనే తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపాలిటీలలో కూడా టెండరు రాణి దగ్గర నామినేషన్ పద్దతిలో వెంటనే పనులు చేపట్టాలన్నారు. నర్సరీలలో మొక్కల జర్మినేషన్ బాగుందని, పెద్ద మొక్కలు సిద్ధం ఉంచుకోవాలని, వచ్చే సంవత్సరానికి ప్లాంటేషన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.


స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ ఫేస్ -2 అవార్డు లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ అవార్డు పొందే విధంగా ఘనవ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా ఉంచడం, పెయింటింగ్, గోడ పత్రికల ద్వారా సుస్థిర లక్ష్యాలు సాధించిన వివరాల సమాచారం ప్రజలకు చేరవేయడం ద్వారా ఆదర్శ పంచాయతీగా ఉన్న గ్రామ పంచాయతీలు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఈ నెల 30 లోగా అప్ లో వివరాలు పొందు పరచాలని అన్నారు. ఒక్కో మండలం నుండి 15 ఉత్తమ గ్రామపంచాయతీల వివరాలను అవార్డుకై ప్రతిపాదనలు పంపాలన్నారు. అమ్రిత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా జూన్ నాటికి జిల్లాలో ఎకరా లోపు గుర్తించిన చెరువులను పూడిక తీసి ఎక్కువ నీరు నిలువ ఉండే విధంగా పునరుద్ధరించి, బలోపేతం చేసి వాటి వివరాలను BAISA అప్ లో అప్ లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ శ్రీనివాస్, జెడ్పి సీఈఓ శైలేష్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, డీఎఫ్ ఓ రవి ప్రసాద్, డిపిఓ సాయిబాబ, మునిసిపల్ కమీషనర్లు మోహన్, వెంకట గోపాల్, ఉమాదేవి, ఎంపిడిఓలు, ఎంపిఓలు, ఎపిఓ లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.