విజయవాడ నగరంలో వరద తీవ్రత తగ్గినా, కాలనీలు నీట మునిగే ఉన్నాయి. 4 రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. బుధవారం కూడా కృష్ణా జిల్లాలో పాఠశాలలకు సెలవు కొనసాగుతోంది.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నగరంలో నీట మునిగిన కాలనీలకు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు.
వరద బీభత్సానికి మొత్తం 6,44,536 మంది ప్రభావితం కాగా ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు.
వీరి కోసం 194 వైద్య శిబిరాలు ఏర్పాటయ్యాయి. విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న నిర్వాసితులకి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వరద కారణంగా రైల్వే ట్రాక్లపైకి నీరు చేరడంతో 328 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది దక్షిణ రైల్వే. 12 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా 174 రైళ్లను దారి మళ్లించారు.
1,80,243 హెక్టార్ల మేర వరి పంట నీటమునిగింది. 17,645 హెక్టార్లలో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 149 పశువులు, 59,800 కోళ్లు మృతి చెందాయి. వరద తాకిడికి 2,851 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసమయ్యాయి.