రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రాణ, పంట నష్టాలతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినందున స్వయంగా పరిశీలనకు రావాలని ప్రధానమంత్రిని కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో ఏర్పడిన వరదలపై హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు.

అతి తక్కువ సమయంలో ఇంత భారీ వర్షాలు కురవడానికి కారణాలు, రెండు రోజుల పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారులను సిఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు.

ఊహించిన దానికన్నా ఎక్కవ వర్షాలు వచ్చాయని, గతంలో అయిదేళ్లకో, పదేళ్లకో ఇలా వచ్చేవని ఇటీవల తరచూ వస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు సిఎం రేవంత్‌తో తెలిపారు.