తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావుతో పాటు కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలోగా అంటే పదిహేను రోజుల్లో పూర్తిగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీతో పాటు రైతులకు మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఎఫ్‌ఆర్‌బీఎం నిధులు విడుదల కాకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష వంటి కారణాలతో గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటు కారణంగా కొంత జాప్యం జరుగుతోందని కేసీఆర్ అన్నారు.

అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు. హామీ మేరకు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగించాం.కరోనా వంటి అనూహ్య అవాంతరాలు, ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్ష కోత, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధులపై కక్ష సాధింపు చర్యల కారణంగా రైతు రుణమాఫీ కార్యక్రమం ఆలస్యమైంది. కొంత కాలం.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది.. ప్రభుత్వం ఇప్పటికే చెప్పినట్లు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను విస్మరించే ప్రసక్తే లేదు.. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా.. ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. వ్యవసాయాభివృద్ధికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పినట్లే.. రైతులు సాధికారత సాధించి ఆర్థికంగా ఎదిగే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.