తెలంగాణ వరింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్‌’ నిర్మాణానికి నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 145 విడుదల చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మీడియా అకాడమీ చైర్మన్‌, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలోనే టీయూడబ్ల్యూజే ఏర్పడిందని అన్నారు. నాటినుంచి టీయూడబ్ల్యూజే చేస్తున్న కృషితోపాటు ముఖ్యమంత్రికి జర్నలిస్టుల పట్ల ఉన్న సానుకూల వైఖరి, ఔదార్యం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే భవన నిర్మాణానికి అందరి సహకారంతో చర్యలు చేపడతామని చెప్పారు.
జర్నలిస్టుల భవన్‌ కోసం గత ఐదు సంవత్సరాలుగా యూనియన్‌ నాయకుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఉపాధ్యక్షుడు రమేశ్‌ హజారే కృషి చేశారని గుర్తుచేశారు. టీయూడబ్ల్యూజేకు అనుబంధంగా ఉన్న జర్నలిస్టు సంఘాలకు, వాటి కార్యక్రమాలకు ఈ భవన్‌ కేంద్రంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రమేశ్‌ హజారే, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, యోగానంద్‌, తెంజూ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇస్మాయిల్‌, కార్యదర్శి రమణ, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌(టీపీజేఏ) అధ్యక్షుడు జీ భాస్కర్‌ నాగరాజు, హరీశ్‌ నండూరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం
జర్నలిస్టు భవన్‌ కోసం స్థలం మంజూరు చేసినందుకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ చిత్రపటాలకు పాత్రికేయులు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్ట్‌ సంఘ నాయకులు సంబురాలు చేసుకొంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.