భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించాడు. అయితే ఈ టోర్నీ అనంతరం భారత జాతీయ జెండాపై నీరజ్ తన దేశభక్తిని చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళ్ళితే…
అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీ అనంతరం నీరజ్ చోప్రా దగ్గరికి ఒక హంగేరీయన్ అభిమాని వచ్చి భారత జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది. దీనిపై నీరజ్ సున్నితంగా తిరస్కరిస్తూ.. ”క్షమించండి. ఇది మా జాతీయ జెండా. దీనిపై ఆటోగ్రాఫ్ ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడం అవుతుంది.. దానికి బదులుగా మీ టీషర్ట్పై ఆటోగ్రాఫ్ ఇవ్వగలను” అంటూ ఆమె టీషర్ట్పై ఆటోగ్రాఫ్ చేశాడు.