దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్‌ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లెళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా ఇదే సీన్ రిపీట్ అవగా.. ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఎదురు చూశారు.

అయితే తండ్రి వర్ధంతి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు షర్మిళ చేరుకున్నారు. ఉదయమే తండ్రికి నివాళులర్పించిన షర్మిల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు. షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.