తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు గవర్నర్గా నియమించనున్నారంటూ కోలీవుడ్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనిపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజినీకాంత్కు గవర్నర్ పదవి అనేది దేవుడి చేతిలో ఉందన్నారు. అదేసమయంలో రజినీకాంత్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రారని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం రజినీతో భేటీ కావడం వెనుక ఎలాంటి రాజకీయమూ లేదన్నారు. రజినీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో వుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఉత్తరభారత పర్యటనకు వెళ్లిన రజనీకాంత్… ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తదితరులతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గవర్నర్ పదవి రానుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.