వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాలలో తాము ఊహించిన మెజారిటీ రీచ్ అయ్యామని కడియం కావ్య అన్నారు. డాక్టర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా మరింత రాణించడానికి దోహదపడుతుందని తెలిపారు. మొదటి నుంచి మహిళల సమస్యల కోసం కడియం ఫౌండేషన్ ద్వారా పనిచేశానని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి, నేను ఎంపీ అభ్యర్థిగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. అర్బన్ లో బీజేపీకి బలం ఉంటుందని ప్రచారం జరిగినా.. కాంగ్రెస్ మెజార్టీ సాధించిందన్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు పునరుద్ధరణ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. తనను ఎంపీగా గెలిపించిన వరంగల్ పార్లమెంటు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎన్నో పదవులు నిర్వహించిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటీవల కాంగ్రెస్‌ గూటికి చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యలకు పార్టీ కండువా కప్పారు. ఇక వరంగల్‌ పార్లమెంటు స్థానం నుంచి కడియం కావ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.