మొన్నటి మొన్న టర్కీ, సిరియాలు…ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయాయి. వరుసగా భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఇదిలావుంటే.. నిన్న భారత్‌ను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ ఉదయం చైనా , తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. చైనాలో గురువారం (ఫిబ్రవరి 23) రాత్రి 8:37 గంటలకు జిన్‌జియాంగ్‌లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తూర్పు తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (సిఇఎన్‌సి) ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూకంపాన్ని ధృవీకరించగా, యుఎస్ జియోలాజికల్ సర్వే తజికిస్తాన్‌లో ఈ ప్రకంపనల గురించి తెలియజేసింది. ఇంత ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా, అక్కడ పరిస్థితి గురించి మరింత సమాచారం రావల్సి ఉంది.