అన్నింటా సిద్ధిపేట ఆదర్శం…
కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్ నాథ్ యాత్రికులకు ఆహార పదార్థాలు అందించే లారీ పూజ కార్యక్రమంలో హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. మానవ సేవయే మాధవ సేవ. శివ భక్తులకు సేవ చేస్తే ఆ పరమ శివునికి సేవ చేసినట్లేనని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

జిల్లా కేంద్రమైన శరభేశ్వరాలయంలో ఆదివారం కేదార్ నాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో తెలుగు వారి భోజనం అందించే ఏకైక లంగర్ కేదార్ నాథ్ యాత్రికులకు సోన్ ప్రయాగ్ వద్ద ఉచితంగా మూడవ సారి తెలుగు వారి భోజనం అందించేందుకు పంపుతున్న ఆహార పదార్థాల లారీ పూజ కార్యక్రమంలో భాగంగా మంత్రి హాజరయ్యారు.

ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

రక్తం గడ్డ కట్టే మంచులో శివ భక్తులకు దక్షిణ భారతదేశంలో మొదటి లంగర్ సిద్ధిపేట ఉండటం సంతోషకరమైన విషయమని తెలిపారు. అన్నింటా సిద్ధిపేట ఆదర్శంగా నిలిచిందని, ఆరోగ్య సిద్ధిపేటలో భాగంగా మితమైన ఆహారం తీసుకుంటే అమితమైన ఆరోగ్యం పొందవచ్చునని మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని హితవుపలికారు. నిత్యం యోగ, ప్రాణాయామం చేయాలని కోరారు. మీరు యోగ చేస్తానంటే అవసరమైతే ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేస్తానని చెప్పారు. అమర్ నాథ్, కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ.. ఆ సమితి ప్రతినిధులను కొనియాడారు. కేదార్ నాథ్ అన్నదాన సేవా సమితికి తనవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణ పారుపల్లి వీధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు.