మెదక్ జిల్లా
మే 18, 2023
బ్యాంకర్ల సహాకారం, అధికారులు, సెర్ప్ సిబ్బంది సమిష్టి కృషివల్ల మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజి అందించడంలో జిల్లా గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు స్థానాలలో ఉన్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో (2023-24) బ్యాంక్ లింకేజి క్రింద 8,149 స్వయం సహాయక సంఘాలకు 491 కోట్ల 81 లక్షల ఆర్ధిక సహాయం అందించుటకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని అందుకు గతంలో మాదిరే లక్షన్ని అధిగమించుటలో పూర్తి సహాకారం అందించవలసినదిగా కలెక్టర్ కోరారు.
గురువారం ప్రజావాణి హాల్ లో జిల్లా గ్రామీణాభివుద్ది సంస్థ ఆధర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజి కి సంబంధించి రూపొందించిన వార్షిక ప్రణాళికను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డి.ఆర్.డి.ఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ అధికారి ఫిలిప్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరంలో 11,339 సంఘాలకు 584 కోట్ల 80 లక్షల బ్యాంక్ లింకేజి ఇవ్వాలని లక్ష్యం కాగా 587 కోట్ల 80 లక్షలు అందించామన్నారు. ఆర్ధిక సంవత్సరం చివరలో ప్రభుత్వం లక్ష్యాన్ని మరో వంద కోట్లకు పెంచినందున లక్ష్యాన్ని అధిగమించుటకు మార్చి నెలాఖరువరకు శ్రమించవలసి వచ్చిందని అన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరం కూడా మధ్యలో లక్ష్యాన్ని పెంచే అవకాశాలుంటాయని, కాబట్టి గత సంవత్సరం లక్ష్యాన్నే నిర్దేశించుకొని వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష్యం అధిగమించేలా చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రధానంగా ఏ.పి .జి.వి.బి., డిసిసిబి, ఎస్.బి.ఐ. బ్యాంకులకు విస్తారమైన బ్రాంచ్ ల దృష్ట్యా లక్ష్యాలు కూడా అధికంగా ఉంటాయని, కాబట్టి ఆయా బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు బ్రాంచ్ మేనేజర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి బ్రాంచి వారీగా, మండల వారీగా ఇచ్చిన లక్ష్యాలను తెలిపి సాధించేలా నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అన్నారు. గత సంవత్సరం లో ఆశాజనకంగా లేని కొన్ని బ్యాంకుల ప్రగతిని సమీక్షిస్తూ ఇప్పటి నుండే ఈ ఆర్ధిక సంవత్సరం లక్ష్యానికనుగుణంగా పనిచేయాలని హితవు చెప్పారు. మహిళలు సకాలంలో రుణాలు తీరుస్తున్నారని, రికవరీ బాగున్నదని, కాబట్టి నిర్దేశించే లక్ష్యాన్ని మించి రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతానికి చేయూత నివ్వవలసినదిగా బ్యాంకర్లకు సూచించారు. గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికా వేత్తలను ప్రోత్సహించాలని, ప్రాధాన్యత రంగాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈసారి మహిళా సంఘ గ్రూపులకు 20 లక్షల వరకు బ్యాంకు లింకేజి ఇవ్వాలని కోరారు.
అనంతరం మంచి ప్రతిభకనబరచిన ఎపిజివిబి, ఎస్ బి ఐ, యూనియన్ బ్యాంకు, డిసిసిబి, యూకో బ్యాంక్, హెచ్.డి.ఎఫ్. సి. బ్యాంక్ అధికారులను, ఏ.పి. ఏం. ను శాలువాతో సన్మానించారు.
ఈ సమావేశంలో అదనపు పిడి. భీమయ్య, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు, డిపిఎం లు , ఎపిఎం లు తదితరులు పాల్గొన్నారు.