• రైతులు ప్రశ్నిస్తారనే భయంతో బైండోవర్..
  • చెప్పింది వినడమే సంబురాల పరమార్థమా..
  • తొమ్మిదేళ్ళ ధాన్యం సేకరణ నుండి అనుభవం పాఠాలు నేర్ప లేదా..
  • ఇంకా ధాన్యం సేకరణలో సమస్యలు పరిష్కరించరా..
  • ధర్మ కాంట తుకాన్ని పరిగణలోకి తీసుకోవాలి
  • కరీంనగర్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా కేంద్రం
జూన్ 3,2023

రైతుల సమస్యలు పరిష్కరించకుండా సంబురాల..? రైతులు ప్రశ్నిస్తారనే భయంతో బైండోవర్ చేస్తున్నారు.. చెప్పింది వినడమే సంబురాల పరమార్థమా..?? తొమ్మిదేళ్ళ ధాన్యం సేకరణ నుండి అనుభవం పాఠాలు నేర్ప లేదా.. ఇంకా ధాన్యం సేకరణలో సమస్యలు పరిష్కరించరా..?? ధర్మ కాంట తుకాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న ధాన్యం సేకరణ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడుస్తున్న ధాన్యం సేకరణలోని సమస్యలను అధిగమించేందుకు, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు.

తొమ్మిదేళ్లుగా ధాన్యం సేకరణ చేస్తున్నా నేటికీ అదనపుతూకం, రవాణా సమస్య, అన్లోడింగ్ సమస్యలు రైతులను వేధిస్తున్నాయన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించి, మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, తొమ్మిదేళ్లుగా ధాన్యం సేకరిస్తున్నా అనుభవం పాఠాలు నేర్పడం లేదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు పరిష్కారం పరిష్కరించకపోవడంతో, సంబురాల్లో రైతులు ప్రశ్నిస్తారనే భయం తో బైండోవర్ చేయడం దారుణమన్నారు. ధాన్యం సేకరణలో సంచికి నాలుగు కిలోల చొప్పున క్వింటాల్కు పది కిలోలు కోత విధిస్తున్నారని, నిబంధనలకు అనుగుణంగా శుద్ధి చేసిన తర్వాత అధికారులు ధ్రువీకరించినా కోత విధించడం దారుణం అన్నారు. ధాన్యం రవాణాకు లారీలు రావాలంటే రైతే మిల్లర్ తో మాట్లాడి అధిక తూకానికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించకుండా సంబురాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

ధర్మకాంట తూకానికి అనుగుణంగా చెల్లింపులు చేయగలిగినప్పుడు రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతులను కాపాడగలుగుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా కేవలం రు.35,000 మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. గతంలో పంట రుణాలపై నాలుగు శాతం వడ్డీ రాయితీ దీర్ఘకాలిక, మధ్య కాలిక రూనాలపై 6% వడ్డీ రాయితీ ఇచ్చామని, ప్రస్తుతం బీఆర్ఎస్ రాయితీలను పూర్తిగా నిలిపివేసిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయనంత కాలం బీఆర్ఎస్ నాయకులకు రైతాంగాన్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడ సాగు చేయడం లేదని ఉమ్మడి కరీంనగర్లో సాగు చేస్తున్న ప్రతి ఎకరం ఎస్సారెస్పీ ప్రాజెక్టుతోనేనని గుర్తు చేశారు.

తొమ్మిదేళ్లు గడుస్తున్నా కాల్వలు మరమ్మత్తు చేయడం లేదనీ, నీటిపారుదల శాఖలను కుదింపు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నూతన ఉద్యోగాల కల్పనకు మార్గదర్శకంగా భావిస్తే ప్రభుత్వ శాఖలను కుదింపు చేస్తూ ఉద్యోగాలను కనుమరుగు చేస్తున్నారన్నారు. పరిపాలన సౌలభ్యం పేరిట పది జిల్లాలను 33వ జిల్లాలుగా మార్చారని, ఖాళీలను మాత్రం పది జిల్లాల అధికారులతోనే సర్దుబాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు రు.1,000 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఈ నిధులను సద్వినియోగం చేసి స్థానిక సంస్థలకు బకాయిలు చెల్లిస్తే ఉపశమనం లభించేదని అన్నారు. రైస్ మిల్లులకు చేరిన ధాన్యం లోడు లారీలను ధర్మకాంట తూకం వేసి, ఆ మేరకు రసీదును నిర్వాహకులకు అందజేయాలి. ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకొని చెల్లింపులు చేయాలి.

భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణ కోసం చెల్లిస్తున్న హమాలీ ఛార్జిలు రు.5 ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంటున్నారని విమర్శించారు. హమాలీ చార్జీల నిధులను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గోపి రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్, జనరల్ సెక్రెటరీ మహేందర్ గౌడ్, ఆదిరెడ్డి, మండ రమేష్, కొయ్యడ మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, గంగారెడ్డి, గంగాధర్ మున్ను, సుధీర్, భూమయ్య నాగరాజు ఆరే శ్రీనివాస్, జిల్లా మత్స్యకార శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ పాల్గొన్నారు.