1986 నాటి విచిత్రమైన ఈ కేసులో బిహార్లో భాగల్పూర్ జిల్లా విజిలెన్స్ కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ఓ అధికారి సహా ఐదుగురు పోలీసుల్ని నిర్దోషులుగా ప్రకటించింది.
రామరతన్ శర్మ, కైలాష్ శర్మ, జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే ఐదుగురుపై నమోదైన కేసును కొట్టివేసింది.
వివరాల్లోకి వెళ్ళితే…
1986లో జూన్ 10న రాత్రి భాగల్పుర్ పరిధిలోని ఓ చెక్పోస్ట్ వద్ద ఐదుగురు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అటుగా వెళ్లే వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన వాహనదారుల నుంచి రూ.2 వసూలు చేస్తున్నట్లు బెగుసరాయ్ ఎస్పీ అరవింద్ వర్మకు ఫిర్యాదు వచ్చింది. దీంతో వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని భావించిన ఎస్పీ.. అందుకు ఓ ప్లాన్ వేశారు. చెక్పోస్ట్ వైపు వెళుతున్న ఓ వాహనాన్ని ఆపిన ఎస్పీ.. రూ.2 నోటుపై తన సంతకం చేసి దాన్ని డ్రైవర్కు ఇచ్చారు. తనిఖీల సమయంలో పోలీసులు లంచం అడిగితే.. ఆ నోటు వారికి ఇవ్వాలని సూచించారు. అనంతరం వాహనం చెక్పోస్ట్ వద్దకు చేరుకున్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. డ్రైవర్ నుంచి రూ.2 డిమాండ్ చేశారు. దీంతో ఎస్పీ చెప్పినట్టుగానే ఆయన సంతకం చేసిచ్చిన నోటును ఓ కానిస్టేబుల్కు డ్రైవర్ ఇచ్చాడు. అనంతరం తిరిగొచ్చి విషయం మొత్తం ఎస్పీకి వివరించాడు.
తర్వాత చెక్పోస్ట్ వద్ద వద్దకు వెళ్లిన ఎస్పీ.. కానిస్టేబుల్ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నడిచింది. చివరకు భాగల్పూర్ విజిలెన్స్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తుది తీర్పులో లంచం తీసుకున్నట్టు సరైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని ఐదుగురు పోలీసులను నిర్దోషులుగా ప్రకటించారు.