వ్యాపారులమంటూ గుంపులుగా వస్తారు. ఎంచుకున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాత.. టార్గెట్ చేసిన ఇంట్లోకి చొరబడతారు. ఆపై సర్వం దోచుకుపోతారు. ఏడాది కాలంగా ఇలా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత కొంతకాలంగా కలకలం రేపుతున్న దోపిడీ ముఠా ఎట్టకేలకు పోలీసులు చిక్కింది. తుపాకీ, కత్తులతో బెదిరించి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ముమ్మిడివరం పోలీసులు అరెస్ట్ చేశారు.

మొత్తం ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విధుల నుంచి తొలగించబడిన ఓ వ్యక్తి.. తన లైసెన్స్‌ను ఉపయోగించి తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తుపాకీతో పాటు కత్తులతో బెదిరించి ఈ ముఠా దొంగతనాలు చేస్తున్నట్లు వివరించారు.దొంగల ముఠా నుంచి 14 లక్షల విలువైన 255 గ్రాముల బంగారం, లక్షా 20 వేల రూపాయల నగదు, రెండు రివాల్వర్లు, 46 బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటితో పాటుగా నిందితులకు చెందిన ఓ కారు, మూడు బైక్‌లు, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు ముమ్మిడివరం పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో షేక్ రఫీ, తుమ్మల సతీష్‌లు విజయనగరంలో ఒకే ప్రాంతంలో ఉండేవారు.

చిన్నతనం నుంచి స్నేహితులు. వారి ఆర్ధిక పరిస్థితి బాగాలేక, చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. షేక్ రఫీ గతంలో CISF కానిస్టేబుల్ గా పని చేసి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో సర్వీస్ నుంచి తొలగించారు. తాను సర్వీస్‌లో ఉన్నప్పుడు జమ్ము కాశ్మీర్ లో రివాల్వర్ లైసెన్స్ పొందానని చెప్తున్నాడు. తుమ్మల సతీష్ కూడా ఒక నమూనా రివాల్వర్ కొన్నాడు. ఎవరైనా బాగా డబ్బున్నవారిని చూసి బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించాలని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. వీరు మరో నలుగురు కార్తీక్, సందీప్, లక్ష్మణ్, రాముల సాయం తీసుకున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి నేరాలు చేస్తున్నారు.

ఈ ఆరుగురు ముఠా నేరాలు చేశారు. జగ్గంపేట, సర్పవరం, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో తుపాకులు, కత్తులుతో బెదిరించి/ కిడ్నాప్ లు చేసి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ముఠాలో కార్తీక్, సందీప్‌లు యలమించిలి, నిదవోలు, ఉండ్రాజవరం, సర్పవరం, ద్రాక్షారామం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో బైక్ ల మీద వెళ్లి ఆడవారి మెడలలో బంగారపు గొలుసులను లాక్కొనివెళ్లారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులలో కార్తీక్, సందీప్ లతో పాటుగా సతీశ్ కూడా పాల్గొన్నాడు.