రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి.

వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి వచ్చి చూసిన స్థానికులు మురికి కాలువలో పసిగుడ్డును చూసి ఆశ్చర్యపోయారు. మురికి కాలువలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ పసికందును బయటకు తీశారు అక్కడి స్థానికులు. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పసిపాప పరిస్థితి చూసి అక్కడి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చిన్నారిని పలమనేరు ఆసుపత్రి తీసుకు వెళ్లి చికిత్స చేయిస్తున్నారు కొందరు యువకులు. అయితే పాపను ఎవరు పడేశారు, ఎందుకు పడేశారు అనే విషయాలు తెలియరాలేదు. ఆడపిల్ల కావడం వల్ల వదిలించుకోవడానికి పడేశారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసలు విచారిస్తున్నారు. పాప పరిస్థితి ఎలా ఉంది అన్నదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.