మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట్
ఏప్రిల్ 18, 2023
✍️భైరవ్ రెడ్డి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం చిన్న శంకరంపేట్ మండలంలో సుడిగాలి పర్యటన చేసి కాళేశ్వరం కాలువ పనులు, తహశీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి తహశీల్ధార్ కార్యాలయంలో మండలానికి సంబంధించి కొన్ని ప్రధాన కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సూరారం, ఎస్.కొండాపూర్, గజగట్లపల్లి ధరణి పాస్ బుక్స్ పంపిణీకి సంబందించిన సమస్యలను రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో తెలుసుకొని వెంటనే పరిష్కరించవలసినదిగా అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.మాందాపూర్ కు సంబంధించి 60 మంది లబ్దిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారని, మిగతా గ్రామాలాలో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు పాసు పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు. అందులో భాగంగా మండలంలోని మూడు గ్రామాలలో ఉన్న సమస్యలపై చర్చించి పరిష్కరించుటకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీచేశామన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అందరు అధికారులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిశా నిర్దేశం చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, తహశీల్ధార్, ఎంపిడిఓ లు, ఎంపిఓలు, వ్యవసాయాధికారులు వాటిని తనిఖీ చేశారని మరో వారం రోజులలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయుటకు అన్నిముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించామని, త్వరలో మండల స్థాయిలో లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. పశు సంవర్ధక శాఖాధికారులు, మండల అధికారుల ద్వారా లబ్ధిదారుని వాటాగా 43,750 డబ్బులు వర్చువల్ ఐ.డి. ద్వారా నేరుగా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయుటపై అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్, కడప, కర్ణాటక రాష్ట్రంలోని రెండు జిల్లాల నుండి గొర్రెలు, పొట్టేలు కొనుగోలు చేయుటకు అనుమతిచ్చిందని అన్నారు.


అనంతరం గవ్వలపల్లిలో కాళేశ్వరం కాలువ, కల్వర్టులు, బ్రిడ్జిలు, అండర్ టన్నెల్ మొదలగు నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ మే చివరి నాటికి పనులు పూర్తయేలా చూడాలని, నిధుల కొరత లేదని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి రవి ప్రసాద్, నీటిపారుదల ఈ ఈ శ్రీనివాస్ రావు, ఆర్డీ.ఓ. సాయి రామ్, తహశీల్ధార్ తదితరులు పాల్గొన్నారు.