మెదక్ జిల్లా
ఏప్రిల్ 18, 2023
గౌతాపూర్ శివారులో రెవిన్యూ, అటవీశాఖ ల మధ్య వివాదంలో ఉన్న భూములను సంయుక్తంగా పరిశీలించి పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం చిలిపిచెడ్ మండల కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్ లతో కలిసి రెవెన్యూ, అటవీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ధరణి పాస్ బుక్స్ పంపిణీకి సంబందించిన సమస్యలను రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో తెలుసుకొని, భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు పట్టా పాసు పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం చండూర్ లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మెదక్ మండలం రాజ్ పల్లి లో ఏర్పాటుచేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి క్లినర్లు, టార్పాలిన్లు, గొనె సంచులు అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు క్రమపద్ధతిలో టోకెన్లు జారీ చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద షామియానా, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తూకంలో తేడా రాకుండా ధాన్యం కొనుగోలు చేసి, టాబ్ ఎంట్రీ ఏ రోజుకారోజు పూర్తి చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించిచారు. రైతులు కూడా 17 శాతం తేమ మించకుండా, ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకనుగుణంగా ధాన్యం తెచ్చేలే అవగాహన కలిగించాలన్నారు. కేంద్రం నుండి మిల్లులకు లారీలను ట్యాగింగ్ చేసి డీవియేషన్ రాకుండా, మిల్లులకు చేరిన 24 గంటలలోగా ధాన్యం దించుకునేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజాప్రతినిధుల సమయం తీసుకొని కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని నిర్వహకులు సూచించారు. కేంద్రాల వద్ద ఉన్న రైతులతో మాట్లాడుతూ ధాన్యంలో తాళ్లు, పొల్లు లేకుండా నాణ్యమైన ధాన్యం కేంద్రాలకు తేవాలని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నందున రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని హితవు చెప్పారు.
కొల్చారం మండలంలోని రాంపూర్ లో మంజీరా పారాబైల్డ్ రైస్ మిల్లును సందర్శించి 2021-22 యాసంగికి సంబంధించి సీఎంఆర్ పెండింగ్ రైస్ ను ఈనెలాఖరులోగా ఎఫ్.సి.ఐ. కి అప్పగించవలసి ఉన్నందున, పెండింగ్ లో ఉన్న ధాన్యాన్ని రోజువారీగా మరాడించి గడువులోగా పంపవలసినదిగా యాజమాన్యాన్ని ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతులకు ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం తీసుకొని భద్రపరచుటకు స్థలం ఏర్పాటు చేసుకోవాలని, హమాలీలను ఎక్కువగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఎంపిడిఓ, తహసీల్ధార్లు, అటవీ శాఖాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.