మెదక్ జిల్లా
ఏప్రిల్ 20, 2023
✍️భైరవ్ రెడ్డి

కుల వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం గొల్ల, కురుమలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు గొర్రెల అభివృద్ధి పధకం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిన్న శంకరంపేట్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రెండవ విడత గొర్రెల పంపిణి పథకంపై లబ్దిదారులకు అవగాహన కలిగించుటకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

ఈ పధకం క్రింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి లక్ష డెభై ఐదు వేల విలువ గల గొర్రెల యూనిట్ ను 75 శాతం సబ్సిడీపై అందించనున్నామని అన్నారు. ఇందులో లబ్ధిదారుని వాటాగా 25 శాతం వాటాధనం 43,750 రూపాయలు వర్చువల్ ఐ.డి. ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయవలసినదిగా సూచించారు. 2017 లో ప్రారంభమైన ఈ పధకంలో గొర్రెల యూనిట్ విలువ ఒక లక్ష 25 వేలు కాగా అందులో లబ్ధిదారుని వాటాగా 31,250 చెల్లించాల్సి ఉండినదని, కొందరు డి.డీలు కూడా చెల్లించారని, ఇప్పుడు యూనిట్ ధర పెరిగినందున అట్టి బ్యాలెన్స్ డబ్బులు 12,500 వెంటనే చెల్లించవలసినదిగా ఆమె లబ్దిదారులకు సూచించారు.

ఇంకా వాటాధనం చెల్లించని వారు 43,750 లను త్వరగా కలెక్టర్ ఖాతాకు వర్చువల్ ఐ.డి. లో చెల్లించాలని సూచించారు. ఈ పధకం క్రింద లబ్ధిదారుడు బ్యాంకులో పెట్టుకున్న డబ్బులను పాతబాకీ క్రింద లేదా ఇతర ఖర్చుల క్రింద తీసుకోరాదని బ్యాంకర్లకు సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో మాసంకు అధిక గిరాకీ ఉందని, లబ్ధిదారులు గొర్రెల పోషణలో సరైన మెళకువలు పాటిస్తే బలిష్టంగా పెరిగి అధిగ లాభాలు వచ్చే అవకాశముందని అన్నారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ…

లబ్ధిదారులు తమ ఖాతాలో 45 వేలు జమ చేసి ఆర్.టి.జి.ఎస్. ద్వారా వెంటనే ఈ-ల్యాబ్ పోర్టల్ లో వర్చువల్ ఐ.డి. పద్ధతిన జిల్లా కలెక్టర్ ఖాతాకు 43,500 ల రూపాయలను బదిలీ చేయవలసినదిగా ఇందుకు బ్యాంకర్లతో పాటు అధికారులు సహకరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్, కడప, కర్ణాటక రాష్ట్రంలోని దావన గేరె , చిత్రదుర్గ జిల్లాల నుండి గొర్రెలుపొట్టేలు కొనుగోలు చేయుటకు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయని, రవాణాకు కూడా టెండర్లు పూర్తికావచ్చాయని అన్నారు. మీతో పాటు అధికారులు వచ్చి కొనుగోలు చేసి వివరాలను ఈ-లాబ్ లో పొందుపరుస్తూ పని సులభతరం చేస్తారని అన్నారు. గొర్రెల యూనిట్ ధర లో బీమా, మందులు, రవాణా, దాణ తదితర ఖర్చులు ఇమిడిఉన్నాయని కలెక్టర్ తెలిపారు. సందేహాల నివృత్తికై జిల్లా పశు సంవర్థక కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. గతంలో లబ్దిపొంది కుక్క కాటువల్ల గొర్రెలు చనిపోయిన లబ్ధిదారుల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించుటకు కృషిచేస్తున్నామని, అర్హులైన వారికి పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తామని కలెక్ట రాజర్షి షా చెప్పారు. ఈ సందర్భంగా రెండో విడత గొర్రెల పంపిణి కార్యక్రమంపై ముద్రించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే,కలెక్టర్ లు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి , జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి విజయశేఖర్ రెడ్డి, తహశీల్ధార్ మహేందర్ రెడ్డి, బ్యాంకు మేనేజర్లు ఏంపిటిసిలు, సర్పంచులు గొల్ల,కురుమ సంఘాల నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.