మెదక్ జిల్లా కేంద్రం
ఏప్రిల్ 24,2023
✍️భైరవ్ రెడ్డి

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 70 వినతులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ధరణి, భూ సమస్యలకు సంబంధించిన వచ్చిన వినతుల పై స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాలసినదిగా రెవిన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆస్తి తగాదాలు, వివాదాలకు సంబంధించి పొలిసు వారిని, న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినదిగా ఫిర్యాదీదారులకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు, జిల్లా పంచాయతీ అధికారి, అటవీ శాఖ, మున్సిపాలిటీ, ఎస్సి సంక్షేమం నీటిపారుదల, తదితర శాఖలకు సంబంధించి వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేస్తూ వాటిని పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరిస్తూ ప్రజావాణి వెబ్ సైట్ లో అప్ డేట్ చేయవలసినదిగా అధికారులకు సూచించారు.

అనంతరం అధికారులతో మాట్లాడుతూ…

నూతన కలెక్టరేట్ లో వివిధ శాఖల విభాగాల కోసం పార్టిషన్స్ ఏర్పాటు చేయుటకు గాను తమ శాఖలలో ఉన్న ఇంటరెస్ట్ (వడ్డీ) నిధులను తక్షణమే జిల్లా కలెక్టర్ కు అందజేయవలసినదిగా కోరారు. వివిధ పెద్ద పెద్ద శాఖల ఏర్పాటులో పార్టిషన్స్ కు నిధులు అవసరమున్నాయని, త్వరగా అందజేస్తే తగు ఆమోదం ఇచ్చి ఆర్ అండ్ బి శాఖ ద్వారా వేగవంతంగా పనులు చేపట్టనున్నామని అన్నారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ మండల ప్రత్యేక అధికారులు కంటి వెలుగు శిబిరాలు సమర్థవంతంగా నడుస్తున్నాయో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. నేత్ర పరీక్షలు చేస్తున్న వారికి రీడింగ్ అద్దాలు, మందులు వెంటనే అందించేలా చూడాలని, అవసరమైన స్టాకు ను బౌతికంగా పరిశీలించాలన్నారు.

సంబంధిత శాసనసభ్యుల అంగీకారంతో వారం రోజులలోగా జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా కేంద్రాలను ప్రతి రోజు సందర్శించి నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ధాన్యం తెచ్చేలా రైతులకు అవగాహన కలిగించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా షామియానా, మంచి నీరు ఏర్పాటు చేయాలని, లారీల సమస్య ఉత్పన్నం కాకుండా మానిటరింగ్ చేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

గ్రామ పంచాయతీ నర్సరీలలో జెర్మినేషన్ పరిశీలించాలని, షెడ్ నెట్ ఉండేలా చూడాలని, ప్రతి మొక్క బ్రతికేలా నీరు పోయాలని ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా అటవీ అధికారి, డీఆర్ డిఓ , డిపిఓలను సంప్రదించాలని సూచించారు.

ఈ ప్రజావాణిలో అధికారులు శ్రీనివాస్ రావు, రవి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, కమలాకర్, రజాక్, శ్రీనివాస్ గౌడ్, జెంలా నాయక్, సుధాకర్, నాగరాజ్, సార శ్రీనివాస్, బ్రహ్మాజీ, ఇందిర, కరుణ, శశి భూషణ్ కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితర అధికారులు పాల్గొన్నారు.