మెదక్ జిల్లా
కొల్చారం మండలం
ఏప్రిల్ 25, 2023
✍️భైరవ్ రెడ్డి
అన్నంపెట్టే రైతన్న నేడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని , వారి రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయని వాటిపట్ల అవగాహన కల్పిస్తూ , సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ లను ప్రారంభిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి శారద అన్నారు . మంగళవారం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి లోని రైతు వేదిక లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం న్యాయ విజ్ఞాన సదస్సును ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ….
ఇప్పటికి ప్రజలలో పోలీసులన్నా, కోర్టులన్నా భయమని, కోర్టు గుమ్మం ఎక్కితే ఏదో తప్పు చేసినట్లు, పరువు నష్టం క్రింద భావిస్తూ ముందుకు రావడం లేదని అన్నారు. న్యాయం కోసం కోర్టుకు వచ్చే వారు తక్కువవుతున్నార ని, అందవలసిన వారికీ న్యాయం అందడంలేదని ఉద్దేశ్యంతో న్యాయ స్థానాలు ఉన్న దగ్గర న్యాయ సేవాధికార సంస్థలు స్థాపించి, ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతున్నదని అన్నారు. ఈ సంస్థ న్యాయ సేవలు పొందలేకపోతున్న వివిధ రంగాల గురించి అలోచించి దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా లీగల్ ఎయిడ్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. ఈ క్లినిక్ ప్రతి రోజు ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిర్వహింపబడతాయని, రైతుల సమస్యలను సావధానంగా విని ఏ శాఖల అధికారుల ద్వారా సమస్య పరిష్కారమవుతుందో తెలుసుకొని ఆ అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రైతుల సమస్యలు ప్రత్యేకమైనవని, భూమి దగ్గర నుంచి భూ సరిహద్దులు, పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పధకాలు సక్రమంగా అందుతున్నాయా వంటి అనేక రకాలైన సమస్యలు వివిధ శాఖలతో ముడిపడి ఉంటాయని, ఏ సమస్యకు ఎవరి దగ్గరకెళ్ళాలి, ఎలా దరఖాస్తూ లేదా ఫిర్యాదు చేయాలో ఈ అగ్రి క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇచ్చే అవార్డు కోర్టు డిక్రీ లాంటిదని, అది ఖచ్చితంగా అమలు పరచవలసినదేనని అన్నారు. కాబట్టి రైతులు ఏ సమస్య వచ్చిన క్లినిక్ లో ఉండే న్యాయవాదులను సంప్రదించి న్యాయ సలహాలు పొంది పరిష్కార మార్గాలతో ప్రశాంత జీవితం పొందవలసినదిగా సూచించారు. విద్యార్థులకు కూడా చట్టాలు, న్యాయం పట్ల అవగాహన కలిగించుటకు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా పాఠశాల కళాశాలలో లీగల్ లిటరసీ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సంస్థ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ…
జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఆరు రకాలుగా న్యాయ సేవలు అందిస్తున్నామని అన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా అగ్రిల్ లీల్ క్లినిక్ లు ఏర్పాటు చేసి వివిధ శాఖల ద్వారా రైతు సమస్యల పరిష్కారాకిని కృషి చేస్తున్నామని, జిల్లాలోని రైతులు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్ మాట్లాడుతూ…
నాసిరకం విత్తనాలు, ఎరువుల వాడకం వల్ల పంట నష్టపోయిన, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన మరే ఇతర కారణాల వల్ల సమస్యలెదురైనా అగ్రి లీగల్ క్లినిక్ ను సంప్రదించి న్యాయ సహాయం పొందవలసినదిగా సూచించారు.
జిల్లా వ్యవసాయాధికారి ఆశా కుమారి మాట్లాడుతూ…
చట్టం, న్యాయం వళ్ళ మనమందరం సురక్షితంగా ఉన్నామని అన్నారు. నేడు న్యాయ సేవ సంస్థ ద్వారా చట్టం మనముందుకు వచ్చిందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయశాఖ పరంగా అగ్రి లీగల్ క్లినిక్ లకు అన్ని విధాలా సహకారమందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవ సంస్థ సభ్యులు కరుణాకర్, వ్యవసాయ శాఖా ఏ డి రాజ్ నారాయణ్, కొల్చారం తహశీల్ధార్ చంద్రశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.