జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 25,2023
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ..
ఆరు నెలల నుండి వేతనాలు చెల్లించడంలేదని, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చి, వేతనాలు చెల్లించేలా కృషి చేయాలని జిల్లా ప్రభుత్వ కళాశాలల అతిథి అధ్యాపకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కోరారు.
ఈ మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అతిథి అధ్యాపకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
అతిథి అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తో జీవన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.
వేతన బకాయిల చెల్లింపు జాప్యం తో అతిథి అధ్యాపకులు పడుతున్న కష్టాలను వివరించారు.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా విద్యార్థులకు బోధనా సేవలు అందిస్తున్నా, వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యము తగదన్నారు.
ఆరు నెలల వేతనాలు పెండింగ్ లో ఉండడం తో అతిథి అధ్యాపకులు దుర్బర జీవితం గడుపుతున్నారన్నారు.
బోధన వృత్తి పైనే ఆధార పడి జీవిస్తున్న అతిథి అధ్యాపకులకు నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోతే బతికేదెలా అని ప్రశ్నించారు.
అతిథి అధ్యాపకులకు ఫిక్స్డ్ వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
వినతి పత్రం సమర్పించిన వారిలో జగిత్యాల జిల్లా అతిథి అధ్యాపకుల సంఘం నాయకులు ఈ.రమేష్, ఎం.ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.