జగిత్యాల జిల్లా
ఏప్రిల్ 26,2023
✍️ కిషన్ రెడ్డి
ఏం సాధించారని బిఆర్ఎస్ నాయకుల ఆర్బాటాలు…
పంట నష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా…
బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ధాన్యం కొనుగోళ్లు కాదు తూకం ప్రారంభించాలి…
అకాల వర్షాలతో రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటలు నేలరాలుతుంటే రైతులను పరామర్శించాల్సింది పోయి ప్లినరిల పేరుతో బీఆర్ఎస్ నాయకులు ఆర్బాటాలు చేయడం సమంజసం కాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏం సాధించారని బీఆర్ఎస్ నాయకులు అర్బాటాలు చేస్తున్నారని, రైతులు దుఃఖంలో ఉంటే బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడం బాధాకరమన్నారు.
బుధవారం జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం బట్టేపల్లి గ్రామంలో అకాల వర్షాలకు నష్టపోయిన వరి పొలాలను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పట్టబదుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం సందర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం గింజలు రాలిపోయాయని రైతులు జీవన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా జీవన్ రెడ్డి రైతులను ఓదార్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తేమ శాతం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ జగిత్యాల జిల్లాలో తూకం వేయడం ఆరంభించిన దాఖలాలు లేవన్నారు. తేమ శాతం వచ్చిన తర్వాత కూడా తూకం వేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్భాటాలు చేయడంతో అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే చీడ, పీడలతో పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందన్నారు. సమయానుకూలంగా ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా అధికారులతో మాట్లాడితే తూకం వేస్తామనీ చెప్పడమే కానీ ప్రారంభించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రైతుబంధు పేరిట ఉమ్మడి రాష్ట్రంలోని రాయితీలన్నీ రద్దు చేశారని విమర్శించారు. నాలుగున్నర ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. రైతుబంధు నెపంతో పంట రుణాలపై కల్పించే నాలుగు శాతం వడ్డీ రాయితీ, దీర్ఘకాలిక, మధ్య కాలిక రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ తొలగించి విత్తన రాయితీ ఎత్తేశారని, వ్యవసాయాంత్రికరణ నిలిచిపోయిందని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం తూకంలో కోతలు లేకుండా, రైస్ మిల్లర్ల నుండి రైతులు ఇబ్బంది పడకుండా తూకం వేశామని గుర్తు చేశారు.
రైతులపై భారం పడకుండా హమాలీ చార్జీలు సైతం రాష్ట్ర ప్రభుత్వం రు. 11 చెల్లిస్తే రైతులు కేవలం ఐదు రూపాయలు మాత్రమే చెల్లించేవారని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కల్పించిన రాయితీలన్నీ తొలగించి, రైతుబంధు ఇస్తున్నామనడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన రాయితీలు కొనసాగిస్తూ అదనంగా రైతుబంధు కొనసాగించాలనీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులకు పంట నష్టం పరిహారం అందడం లేదని చెబుతూ… పంటల బీమా పథకంతో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడంతోపాటు, చీడపీడల నుండి పరిహారం అందుతుందని గుర్తు చేశారు.
అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఇస్తామని సీఎం ప్రకటించినా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దళితులను బలహీన వర్గాలను మోసం చేస్తుందని, రైతులను, అల్పసంఖ్యాక వర్గాలను మభ్యపెడుతుందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు సీఎం సహా నిధి చెక్కుల అందిస్తున్నామనీ గొప్పలు చెప్తున్నారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఏముంటుందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బాలిక సంరక్షణ పథకం రూపొందించి, చట్టబద్ధత కల్పిస్తే ఆ పథకాన్ని నీరుగార్చి ప్రతి ఆడబిడ్డకు రెండు లక్షలు ఇవ్వాల్సి ఉండగా, కళ్యాణ లక్ష్మి పథకం కింద కేవలం రు.1లక్ష ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
2022-23 లో నియోజవర్గానికి మూడు వేల ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్ లో రు.12,000 కోట్లు కేటాయించిన ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని, మార్గదర్శకాలు కూడా రుపొందించలేదనీ ద్వజమెత్తారు.
రాష్ట్రంలో 60 శాతం ఉన్న బలహీన వర్గాలకు నాలుగేళ్లుగా ఒక్కరికి కూడా స్వయం ఉపాధి యూనిట్ అందించలేదన్నారు. కోతలు లేకుండా ధాన్యం తూకం వేయడం ప్రారంభించాలని, అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోండ్ర రాంచంధ్రరెడ్డి, రైతులున్నారు.