శిలాఫలకంపై జెడ్పి చైర్ పర్సన్ పేరు లేకపోవడం బాధాకరం

ఇది ముమ్మాటికి బహుజన మహిళలను అవమానించడమే

జగిత్యాల ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు అధికారులను బలి చేస్తారా…?

జగిత్యాల ఎమ్మెల్యే “హింసించే ఓ పులకేసి”

జగిత్యాల ఎమ్మెల్యే కావాలని చేసిన తప్పుకు అధికారులను బాధ్యులను చేయడం సరికాదని జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ భోగ శ్రావణి అన్నారు.

ఆదివారం జరిగిన కేంద్ర గిడ్డంగులు, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ కు ఫౌండేషన్ వేసే కార్యక్రమంలో ఏర్పాటుచేసిన శిలాఫలకంపై జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ పేరు లేకపోవడం వెనక కుట్ర కోణం దాగి ఉందని శ్రావణి తెలిపారు. శిలాఫలకంపై బహుజన మహిళ అయిన జెడ్పి చైర్పర్సన్ పేరు లేకపోవడం మహిళలకు జరిగిన అన్యాయమని జగిత్యాల మహిళలకు ఒక “బ్లాక్ డే” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే ఒక “హింసించే పులకేసి” అని ఆయనకు బహుజనులు అంటే చులకన అని తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే బహుజనులను రాజకీయంగా ఎదగనీయరని, కానీ ఆయనకు కేవలం సబ్బండ వర్గాల ఓట్లు మాత్రమే కావాలంటూ చురకలంటించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తనను అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు రాజకీయంగా వేధించడం వల్లనే రాజీనామా చేసినట్లు ఆమే తెలిపారు. రాజీనామా చేసి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా కౌన్సిల్ లో ఉన్న మిగితా 11 మంది బీసీ మహిళ కౌన్సెలోర్లను కాదని ఒక ఓసి సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ గా బాధ్యతలు ఎలా ఇస్తారని శ్రావణి ప్రశ్నించారు.

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఖాళీగా ఉన్న రూరల్ ,అర్బన్ ఎంపీపీ పదవులను కూడా రిజర్వేషన్లకు విరుద్ధంగా ఇతరులకు కట్టబెట్టారంటూ ఆమే ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట కనిపించే ఎమ్మెల్యే ఒక డాక్టర్ లోపల మరో యాక్టర్ ఉన్నాడంటూ ఎద్దేవా చేసారు. తరతరాలు ఉండే శిలాఫలకాల పై పేరు లేకుండా చేయడం దారుణమని, కింది స్థాయి మహిళా నేతలు ఎమ్మెల్యే తీరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు . గతంలో అనేకమంది మహిళా అధికారులు మీవల్ల కన్నీరు పెట్టుకుంది నిజం కాదా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.


మహిళలను బహుజనులను ఎదుగనీయకుండా చేసి ఎమ్మెల్యే రాక్షశానందం పొందుతున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక మహిళా జిల్లా పాలనాధికారి ముందు జిల్లాస్థాయి ప్రోటోకాల్ ఉన్న బహుజన మహిళను అవమానించడం బాధాకరమన్నారు. మహిళలను అగౌరపరిచే ఎమ్మెల్యే కి మహిళా దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు.


జగిత్యాల ఎమ్మెల్యే వ్యక్తిత్వం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముందు ఈరోజు ప్రత్యక్షంగా బయటపడిందని విమర్శించారు. జిల్లాలో ఎక్కడ ప్రోటోకాల్ గొడవ జరగదని కేవలం జగిత్యాల నియోజకవర్గంలొనే జరుగుతుంది ఎందుకు?.. దానికి బాధ్యులు మీరు కదా అని ఎమ్మెల్యే ను శ్రావణి ప్రశ్నించారు.

జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్తారని శ్రావణి అన్నారు.