ప్రేమ పేరుతో మైనర్ బాలికలు, అమ్మాయిలపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, కల్యాణ్ జిల్లాలోని తిస్‌గావ్‌కు చెందిన ఓ బాలిక (12)ను ఆదిత్య కాంబ్లే (20) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేదిస్తున్నాడు. కానీ, అతని ప్రేమను ఆ బాలిక తిరస్కరించింది. దీంతో బాలికపై అతను కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆ బాలిక తన తల్లితో కలిసి ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందనే నెపంతో ఆమె తల్లి ముందే విచక్షణారహితంగా బాలికను 10 సార్లు కత్తితో పొడిచాడు. కత్తి పోట్లకు గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లే పై ముందుగా హత్య కేసు, తర్వాత ఆత్మహత్యకు యత్నించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.