చంద్రయాన్ 3లోని ల్యాండర్ కానీ, రోవర్ కానీ, ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నింట్లో అమర్చిన పరికరాలు పనిచేయడానికి, వాటి నుంచి సమాచారం భూమ్మీద ఉన్న డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపడానికి కానీ విద్యుత్ అవసరం. ఈ విద్యుత్ వాటికి సోలాప్ ప్యానెళ్ల నుంచే వస్తుంది. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యోదయం అయ్యే సమయానికి సరిగ్గా ల్యాండర్‌ మాడ్యూల్‌ను దించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఎందుకంటే చంద్రుడి మీద ఒక పగలు అంటే.. భూమ్మీద 14 రోజులకు సమానం. చంద్రుడి మీద ఒక రోజు అంటే భూమ్మీద 28 రోజులకు సమానం. చంద్రుడి మీద సూర్యరశ్మి పడే పగటి సమయం అంటే భూమ్మీద 14 రోజుల పాటు మాత్రమే అక్కడున్న ల్యాండర్, రోవర్లకు విద్యుత్ అందుతుంది. కాబట్టి అవి ఆ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి.

ఆ తర్వాత అవి చంద్రుడి రాత్రిలోకి 14 రోజుల పాటు వెళ్లిపోతాయి. చంద్రుడి ఉపరితలంలో ఈక్వేటర్ దగ్గర పగటి ఉష్ణోగ్రతలు 180 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటాయి. అదే రాత్రి వేళ్లలో మైనస్ 120 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరుకుంటాయి. చంద్రుడి ధ్రువాల వద్దకు వెళ్లే కొద్దీ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతూ ఉంటాయి. ధ్రువాల వద్ద కొన్ని పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్స్‌లో మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ప్రస్తుతం చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్లు కూడా దక్షిణ ద్రువానికి దగ్గరగా 70 డిగ్రీల అక్షాంశం దగ్గర ల్యాండవ్వబోతున్నాయి. అంటే ఇక్కడ 14 రోజుల తర్వాత పూర్తిగా అత్యంత శీతల ఉష్ణోగ్రతల్లోకి ల్యాండర్, రోవర్లు వెళ్లిపోయి 14 రోజుల పాటు ఉండిపోతాయి. అంత శీతల ఉష్ణోగ్రతల వద్ద అందులోని విద్యుత్ పరికరాలు, బ్యాటరీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశముంది. అందుకే వీటి జీవిత కాలం 14 రోజులు మాత్రమే అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్ నాథ్ అన్నారు.

ఒకవేళ మళ్లీ 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ల మీద విద్యుత్ పడి, వాటిలో బ్యాటరీలు ఛార్జ్ అయ్యి పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కేవలం రోవర్ మాత్రమే పునరుజ్జీవమై, ల్యాండర్ పనిచేయకపోయినా ఉపయోగం ఉండదన్నారు. ఎందుకంటే రోవర్ కేవలం ల్యాండర్‌తో మాత్రమే సంభాషించగలదు. రోవర్ ల్యాండర్‌కు డేటా పంపించినా ల్యాండర్ పనిచేయకపోతే… ఆ సమాచారం భూమిని చేరే అవకాశం ఉండదన్నారు. మొత్తంగా చంద్రుడి మీదకు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి ఇప్పుడు ఇస్రో చేస్తున్న ప్రయోగాలు, వాటి నుంచి వచ్చే సమాచారం చాలా చాలా కీలకం.