ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్రం విధించిన 40% సుంకాన్ని విధించడంతో అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ముంబైకి ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మిత్రపక్షం రైతు క్రాంతి సంఘటన్‌ హెచ్చరించింది.

దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌ అయిన నాసిక్‌ వ్యాపారులు ఉల్లిగడ్డల వేలం పాటలను నిరవధికంగా నిలిపివేశారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర మంత్రి దాదా భూస్‌ ఉల్లిని రెండు నుంచి నాలుగు నెలల పాటు తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవని, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.

ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానేయ్యండి అని, ‘మీరు 10 లక్షల విలువైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు, రిటైల్‌ ధర కన్నా 10 నుంచి 20 రూపాయలకు ఎక్కువకు సరుకును కొనవచ్చు. అదేమీ మీకు పెద్ద భారం కాదు. అలా కాకుండా పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టమేమీ ఉండదు’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో క్వింటాల్‌ రూ. 200 మాత్రమే లభించే ఉల్లిగడ్డ మరో సమయంలో రూ. 2 వేల ధర పలుకుతుందని, దీని పరిష్కారానికి అందరితో చర్చలు జరపాలని ఆయన అన్నారు.