ఓ వ్యక్తి కేవలం మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా వినడం వల్ల గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ఘటన ఒడిశాలో జరిగింది. రూర్కెలాలో సరస్వతీ విగ్రహం నిమజ్జనం సందర్భంగా పెద్ద శబ్దంతో 50 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.

ఈ వేడుకలో మ్యూజిక్ ప్లే చేసిన డీజేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని ప్రేమ్ నాథ్ బారాభయ అనే వ్యక్తి టీ స్టాల్ యజమానిగా గుర్తించారు. సరస్వతీ విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్ ఎక్కువస్థాయిలో ప్లే చేయడంతో గుండెపోటు వచ్చింది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్లే చేయడానికి భద్రక్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ పార్టీని నియమించుకున్నట్లు సమాచారం.

గుండెపోటు కారణంగా ప్రేమ నాథ్ కుప్పకూలిపోవడంతో అతడిని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి (ఆర్జీహెచ్) తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో స్థానికులు రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.